వేదాంతము (ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతముల పరిశీలన):
వేదాలు అపౌరుషేయాలు. అవి ఎవరో ఒకరి చేత రచింపబడినవి కావు.వేదాలలోని ఉపనిషత్తుల సారమే వేదాంతము.వేదాంతము ప్రకారము మనిషిలో దివ్యత్వం ఉంది.మన చుట్టూ ఉన్నది మనం చూసేది ఆ దివ్యత్వంయొక్క చైతన్యమే.మనిషితత్వంలో ధృఢమైనది,శక్తివంతమైనది, మంచిది ఏదైతే ఉందో అదంతా ఆ దివ్యత్వం యొక్క ప్రతిరూపమే.బయటకి రకరకాలుగా భిన్నంగా కనిపిస్తున్నా మనిషికి, మనిషికి మధ్య అంతరంలేదు.ఆ అనంతమైన మహాసముద్రంలో అందరు తరంగాలు.ప్రతిఒక్కరు ఆ అనంతమైన భగవత్ శక్తిని బయటకి ప్రకటించాలని కోరుకుంటారు.ప్రతి ఒక్కరిలోను ఆ దివ్య తత్వమైన ఉనికి జ్ఞానము ఆనందము అనేది నిజస్వభావంగా జన్మహక్కుగా ఉంది.మనుష్యులలోని అంతరం అంతా లోపల ఉన్న శక్తిని వ్యక్త పరచడంలోనే ఉంది. మనిషిలో బయటకి వ్యక్తమయ్యే అతని స్వభావాన్ని కాకుండా అతని నిజస్వభావాన్ని గుర్తించమని వేదాంతం చెప్తోంది. అందువలన గురువులు మనిషిలొేని దివ్యత్వాన్ని మేల్కొల్పాలి.
బ్రహ్మసూత్రాలు వేదాలలో ఉపనిషత్తులలోని వేదాంతాన్ని చర్చించింది.ఎందరో వేదాంతులు ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి,భగవద్గీతకి భాష్యంచెప్పారు.
ఆ భాష్యాలు ముఖ్యంగా ముగ్గురు వేదాంతులు రాసినవి ప్రసిద్ధికెక్కాయి. అవి ద్వైతపరంగా భాష్యం చెప్పిన మధ్వాచార్యులవారిది, విశిష్టాద్వైతపరంగా చెప్పిన రామానుజాచార్యులవారిది, అద్వైతపరంగా చెప్పిన శంకరాచార్యులవారిది.
ద్వైతసిధ్ధాంతం:
ఈ సిధ్ధాంతం ప్రకారం సృష్టికర్త సృష్టి వేరు.ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ప్రకృతి కంటే మనిషి ఆత్మ కంటే భిన్నమైనవాడు. భగవంతుడు అనంతుడు,ప్రకృతి అనంతమైనది,జీవులు అనంతమైనవారు. ప్రకృతిలోను జీవులలోను మార్పు ఉంటుంది. కానీ పరమాత్మలో ఎటువంటిమార్పు ఉండదు.ఈ సిధ్ధాంతం ప్రకారం పరమాత్మకి గుణాలు ఉంటాయి.ఆయనకి శరీరం ఉండదు కాని మానవ లక్షణాలు ఉంటాయి. భగవంతుడు దయామయుడు, న్యాయమూర్తి, శక్తిమంతుడు, సర్వవ్యాపి.అతని వద్దకు వెళ్లవచ్చు, ప్రార్ధింపవచ్చు, ప్రేమించవచ్చు. ఆయన కూడా మనలని ప్రేమిస్తాడు.మానవులలో ఉండే దుర్గుణాలు ఉండవు అన్నీ సుగుణాలే ఉంటాయి.
ద్వైత సిధ్ధాంతం ప్రకారం ప్రతి ఆత్మకి మోక్షం ఉంటుంది.ఎవరు వదలి పెట్టబడరు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాక, సుఖదుఃఖాలు అనుభవించాక అందరు అక్కడకి చేరుకుంటారు.
ద్వైతమతరత్నాలు
1)శ్రీహరి సర్వోత్తముడు.
2)జగత్తు సత్యము.
3)ఈశ్వరుడు,జీవులు,జడములు - వీటిమధ్య పంచ బేధాలు కలవు.
4)జీవులు అస్వతంత్రులు మరియు పరమాత్ముని సేవకులు.
5)జీవులు స్వరూపత భిన్నులు మరియు తారతమ్యము కలవారు.
6స్వరూపానుభూతే ముక్తి అనబడును.
7)పరమాత్మునియందు నిరతిశయ అచంచల భక్తి ఎల్లపుడు చేయుటయే ముక్తికి సాధనము.
8) ప్రత్యక్షము,అనుమానము,ఆగమములనునవి మూడు ప్రమాణాలు.
9)పరమాత్ముని వేదములవలననే తెలియనగును.
విశిష్టాద్వైతము:
ఉపనిషుత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి విశిష్టాద్వైత సిధ్ధాంతం ప్రకారం శ్రీరామానుజాచార్యుల వారు భాష్యం రాసారు.ఈ సిధ్ధాంతం ప్రకారం భగవంతుడే సృష్టి, సృష్టికర్త. కార్యం, కారణం ఆయనే.అంతా భగవంతుడే.దివ్యత్వం ఒక్కటే. దానిని నారాయణుడని, విష్ణువని అంటారు.జీవులందరు నారాయణుని అంశలు. జీవులని చిత్త అంశ అని ప్రకృతిని అచిత్తఅంశ అని బ్రహ్మని చిత్త అచిత్త విశిష్ట బ్రహ్మ అని అంటారు.
వేదాలలో చెప్పినట్లు సాలెపురుగు తన లాలాజలంతో గూడుని నేసినట్లు ఈ సృష్టి అంతా భగవంతుడిచే నేయబడిందని వీరి సిధ్ధాంతం. ఉన్నది ఒక్కటే జీవులందరు ఆ దివ్యత్వం యొక్క భాగాలు అని గ్రహించడమే మోక్షం.జ్ఞానంకంటే భక్తికే వీరు ప్రాధాన్యతని ఇస్తారు.
ఈసృష్టి అంతా పరమాత్మదే.ప్రకృతి జీవులు పరమాత్మ శరీరం. మనిషికి శరీరం మరియు ఆత్మ ఉన్నట్లే ఈసృష్టిలోని జీవులందరు పరమాత్మ శరీరం.పరమాత్మే అందరిలో ఉన్న ఆత్మ.
ద్వైతులు విశిష్టాద్వైతులు ఇరువురు కూడా స్వాభావికంగా ఆత్మ పరిశుధ్ధమైనదని కర్మల ద్వారానే అది మలినం అవుతుందని ఒప్పుకుంటారు.చేసే ప్రతి మంచి పని ఆత్మని కుంచింప చేస్తుందని మంచి పని ఆతనిని వికసింప చేస్తుందని అంటారు.మండే జ్వాలనుండి నిప్పురవ్వలు వచ్చినట్లు పరమాత్మ నుండి ఆత్మలు వచ్చాయని వీరి సిధ్ధాంతం.ప్రతి ఆత్మకి ఒకే లక్ష్యం ఉంటుంది.
అద్వైత సిధ్ధాంతం:
శ్రీశంకరాచార్యులవారు అద్వైత సిధ్ధాంత పరంగా ఉపనిషత్తులకి , బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి భాష్యంరాసారు. ఈ సిధ్ధాంతం ప్రకారం ఉన్నది ఒక్కటే ఉనికి ఒక్కటే - చైతన్యం. ఉన్నది ఒక్కటే అని తెలియక అనేకంగా ఉన్నాయని భ్రమ పడుతున్నాము.
ఈ సిధ్ధాంతం ప్రకారం భగవంతుడే నిమిత్త కారణం, ఉపాదానకారణం. ఆయన సృష్టికర్తేకాదు, సృష్టికూడా ఆయనే.అంత పవిత్రమైన భగవంతుడు సృష్టికింద మారడం ఏమిటి అని అనుకుంటే వారిచ్చే సమాధానం. ఈ జగత్తంతా మిధ్య. అసలు ఉన్నది ఒక్కటే. అనంతమైనది, సత్యమైనది ఒక్కటే. ఒక్కటే ఉనికి. అందరిలోను ఉన్నది ఒక్కటే ఆత్మ. తెలిసినదాని వెనకాల తెలియనిదాని వెనకాల ఉన్నది ఒక్కటే ఆత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం ఈ జగత్తుని చూస్తున్నాము. చరము అచరము అన్నీకూడా ఆత్మే.నామరూపాలు తీసివేస్తే ఉన్నది ఆత్మే. ఆత్మకి లింగ బేధం లేదు. ఆత్మ సూర్యునికంటే నక్షత్రాలకంటే, దేవతలకంటే అత్యున్నతమైనది. శాస్త్రాలుకాని గ్రంధాలుకాని మనిషిలో నెలకొనిఉన్న ఆత్మ యొక్క విశిష్టతని చెప్పజాలవు.
అద్వైత సిధ్ధాంతంలొే అతి క్లిష్టమైన ప్రశ్న, పదే పదే అడిగే ప్రశ్న, దానికి ఇప్పటికి సరి అయిన సమాధానం రాని ప్రశ్న అపరిమితమైన ఆ పరమాత్మ పరమితం ఎలా అయ్యాడు?
దానికి స్వామి వివేకానంద ఈకింద విధంగా సమాధానం చెప్పారు.
A
Absolute(పరమాత్మ)
C
Time (కాలము)
Space( ఎడము,ఖాళీ, ఆకాశము)
Causation(కారణము)
B
Universe(జగత్తు)
A.పరమాత్మ. B.ప్రపంచం. పరమాత్మ ప్రపంచంగా మార్పు చెందాడు. ప్రపంచం అంటే భౌతిక ప్రపంచమే కాకుండా మానసిక ఆధ్యాత్మిక జగత్తు గ్రహాలు నక్షత్రాలు ఉనికిలోకి వచ్చినవన్నీ.
మనస్సు మార్పు చెందేది. శరీరం మార్పు చెందేది. సృష్టి మార్పులతో కూడుకున్నది. పరమాత్మ time, space, causation ద్వారా ప్రపంచంగా మార్పు చెందాడు. ఈ మూడింటిని కలిపి మాయ అని అంటారు.అద్వైత సిధ్ధాంతంలో ఇది ముఖ్యమైన సిధ్ధాంతం.
Time,space, causation అనేవి అద్దంలాంటివి. కింద స్థాయినుండి చూస్తే ప్రపంచం కనిపిస్తుంది. పరమాత్మలో మాత్రం time, space, causation అనేవి ఉండవు. ఎందుకంటే అక్కడ మనస్సు కాని ఆలోచన కూడా ఉండదు. బాహ్యంగా ఎటువంటి మార్పు ఉండదు కనుక అక్కడ space ఉండదు.ఒక్కటే ఉన్నపుడు కదలిక కాని కారణంకాని ఉండదు. దీనిని మనం బాగా అర్ధం చేసుకోవాలి,వంట పట్టించుకోవాలి.
అద్వైతం అంటే ఒక్కటేకదా. మరి ఇక్కడ పరమాత్మ time space causation(మాయ) ద్వారా అనేకంగా మార్పు చెందాడు కదా మరి రెండు ఉన్నట్లు కదా అని కొంతమంది అంటారు.
దానికి అద్వైతులు చెప్పే సమాధానం రెండు ఉండాలి - అంటే రెండూ స్వతంత్రంగా ఉండాలి. మాయ అనిపిలిచే ఆ మూడింటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు.కాలము అనేది ఎప్పుడు మారిపొేతూ ఉంటుంది. Space చాలా సూక్ష్మమైనది. అది ఏమిటో మనకు తెలియదు అయినా అన్నింటలోనూ వ్యాపించి ఉంది.
ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం. పరమాత్మ సముద్రమైతే ఈ కనిపించేదంతా చరము అచరము అందులో తేలుతున్న అలలు. అల సముద్రం కంటే భిన్నంగా ఎప్పుడు అవుతుంది. నామ రూపాల ద్వారా. కెరటం మాయమవగానే నామరూపాలు ఉండవు అది సముద్రమే అవుతుంది. అలాగే మాయ తొలగి పొేగానే మనిషి స్వేఛ్ఛని పొందుతాడు.

No comments:
Post a Comment